సురేందర్తో ఐసరి గణేశ్ చిత్రం
తమిళసినిమా: నూతన కళాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే డా.ఐసరిగణేశ్ తాజాగా మరో వర్ధమాన దర్శకుడికి అవకాశం కల్పిస్తున్నారు. అలా నటుడు ఆర్జే బాలాజీ నుంచి ప్రస్తుతం మెగాఫోన్ పట్టిన యూట్యూబర్ వీజే.సిద్ధు వరకు పలువురు నూతన దర్శకులకు అవకాశాలను కల్పించి ప్రోత్సహిస్తున్నారు. వీజే.సిద్ధు దర్శకత్వంలో దయంకరం అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఐసరి గణేశ్ తాజాగా కేజే.సుంరేందర్కు తమ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని కల్పించారు. నూతన నటీనటులతో మాయాబింబం అనే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దర్శకుడు సురేందర్. నలుగురు మిత్రుల మధ్య జరిగే ఇతి వృత్తంతో సాగే ఈ చిత్రంలో అందులో వైద్య విద్య చదువుతున్న ఒక యువకుడికి ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం చేసే యువతికి మద్య కలిగే ప్రేమను చాలా కొత్తగా, ఆలోచింపజేసే విధంగా తెరపై ఆవిష్కరింపజేశారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం చూసిన డా.ఐసరిగణేశ్ చాలా బాగుందని ప్రశంసించడంతో పాటు ఈ చిత్ర దర్శకుడికి తమ సంస్థలో దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. దీని గురించి ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాయాబింబం చూడగానే నచ్చేసిందన్నారు. చిత్ర దర్శకుడు సురేందర్కు తమ సంస్థలో చిత్రం చేసే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అందుకుగానూ ఒప్పందం చేసినట్లు ఐసరి గణేశ్ పేర్కొన్నారు.


