క్లుప్తంగా
5 గంటల విద్యుత్ కోత
తిరువొత్తియూరు: మాధవరం సమీపం వడపెంరుంబాక్కం వి.ఎస్.మణి నగర్ ప్రాంతంలో సుమారు 500కు పైగా కుటుంబాల వారు నివశిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రాంతంలో ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కట్ అయ్యింది. విద్యుత్ కేబుల్లో ఏర్పడిన లోపం కారణంగా ఆ ప్రాంతం మొత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీనిపై స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విద్యు త్ ఉద్యోగులు మరమ్మతు అయిన విద్యుత్ వైర్లను సరిచేసి పనిలో నిమగ్నమయ్యారు. అయితే చాలా సమయం గడిచినా పని పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు నిద్రపోలేక చీకట్లో ఇబ్బంది పడ్డారు. తరువాత సుమారు 5 గంటల తర్వాత, అర్ధరాత్రి ఒంటి గంటకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. దీని తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో
బస్సు డ్రైవర్ మృతి
తిరువళ్లూరు: ద్విచక్ర వాహనాన్ని డీకొట్టిన సంఘటనలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూరు జిల్లా పూండి గ్రామానికి చెందిన దేవరాజ్(55). ఇతను ఊత్తుకోట డిపోలో ప్రభుత్వ బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం సూళ్లూరుపేట నుంచి తిరువళ్లూరు వైపు వెళ్లే బస్సులో విధులు నిర్వహించి రాత్రి ఇంటికి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. తిరువళ్లూరు డిపో నుంచి పూండికి వెళ్తున్న సమయంలో ఊత్తుకోట వైపు వెళ్ళుతున్న సిమెంట్ లారీ దేవరాజ్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దేవరాజ్ను స్థానికులు చికిత్స నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవరాజ్ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పుకార్లను ఖండించిన పోలీసులు
తిరువొత్తియూరు: కస్టమర్ సర్వీస్ సెంటర్ నుండి 6 అంకెల నంబర్ నుండి వచ్చే కాల్స్ స్వీకరిస్తే సెల్ఫోన్ పేలిపోతుందని వాట్సాప్ ఆడియో వ్యాప్తి చెందుతున్న విషయంపై తూత్తుకుడి జిల్లా పోలీసులు ఖండించారు. ప్రస్తుతం వాట్సాప్లో హలో నేను తూత్తుకుడి నుండి మాట్లాడున్నాను, కస్టమర్ కాల్లో 5 లేదా 6 నంబర్ల కాల్ వస్తుంది, దానిని ఎవరూ తీసుకోకండి, అలా తీసుకుంటే సెల్ పోన్ పేలిపోతుంది. ఇలా చేయడం వల్ల తూత్తుకుడిలో 27 మంది మరణించారు. కాబట్టి దీన్ని అందరూ షేర్ చేయండి అని వాట్సాప్లో ఒక ఆడియో వ్యాప్తి చెందుతోంది. దీనిపై తూత్తుకుడి జిల్లా పోలీసులు విచారణ చేపట్టగా, అలాంటి అవాంఛనీయ సంఘటన ఏదీ జరగలేదని తేలింది. దీనిపై జిల్లా పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే ఇది పాత వాట్సాప్ ఆడియో, ఇప్పుడు మళ్లీ తప్పుగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి భయపడకండి, అలాగే ఈ వాట్సాప్ ఆడియోను ఎవరికి షేర్ చేయవద్దు ఈ విధంగా ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వాట్సాప్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. నదరు ఆడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా అందులో పేర్కొన్నారు.
బ్రాడ్వేలో పునరుద్ధరణ పనులు
కొరుక్కుపేట: బ్రాడ్వే బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున, అక్కడి నుండి నడిచే బస్సులను శనివారం (జనవరి 24) నుండి రాయపురం, ఐల్యాండ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ టెర్మినల్స్ నుండి నడుపుతామని చైన్నె మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న బ్రాడ్వే బస్టాండ్లో పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి. అందువల్ల శనివారం (జనవరి 24) నుండి బ్రాడ్వే బస్టాండ్ నుండి నడిచే బస్సులను రాయపురం, ఐల్యాండ్ గ్రౌండ్ నుంచి నడపనున్నారు. ఈ బస్సులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ టెర్మినల్స్ నుంచి నడుస్తాయని ప్రయాణికులు గమనించాలని కోరారు.
గుండెపోటుతో ప్రయాణికుడి మృతి
అన్నానగర్: కోయంబత్తూరులోని వాడవల్లి నుండి ఒండిపుదూరుకు 15వ తేదీ మధ్యాహ్నం వెళ్తున్నా ప్రభుత్వ బస్సులో 45 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. దీని తర్వాత బస్సు కండక్టర్ ఈ ప్రయాణికుడిని ఆర్.ఎస్.పురం వద్ద రోడ్డుపై దింపి వెళ్లాడు. ఇది వివాదానికి దారితీసింది. రక్తం వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కొందరు రక్షించి 108 అంబులెన్స్లో కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కి పంపారు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. అతను ఎవరు, ఏ ఊరు, వివరాలు వెంటనే తెలియలేదు. ఈ విషయంలో ముందుగా ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఈసన్, కండక్టర్ శరవణన్లను సస్పెండ్ చేయడం గమనార్హం.


