ఎల్లవేళలా అండగా ఉంటా!
సాక్షి,చైన్నె: ఎల్ల వేళలా అండగా ఉంటానని ప్రత్యేక ప్రతిభావంతులకు, వారి కోసం శ్రమిస్తున్న సంఘాలు, సంస్థలు, ఆశ్రమాలకు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. చైన్నెలోని వినికిడి లోపం, ఇతర ప్రత్యేక రుగ్మతలతో బాధపడే విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న లిటిల్ ఫ్లవర్ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు బుధవారం జరిగాయి. ఇందులో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ విద్యాలయానికి తాను మొదటి సారిగా కాదు, గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం నడిచే ఈ విద్యా సంస్థకు వంద సంవత్సరాలు అన్నది తమిళనాడుకే గర్వకారణంగా పేర్కొన్నారు.
ఆసియా స్థాయిలో ఇలాంటి ఘనత సాధించగలిగిన విద్యా సంస్థలను వేళ్లపై లెక్కించ వచ్చన్నారు. లిటిల్ ఫ్లవర్ విద్యాలయంలో తనకు చాలా సుదీర్ఘ సంబంధం ఉందని, తనను ఆహ్వానించకుండా ఉండి ఉన్నా, పూర్తి అధికారంతో వచ్చి పాల్గొని ఉండే వాడినని వివరించారు. ఇక్కడికి ఎమ్మెల్యేగా, మేయర్గా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా వచ్చానన్నారు. సీఎం అయ్యాక ప్రతి ఏడాది ఇక్కడికి తప్పకుండా వస్తున్నానని గుర్తు చేశారు. ఇక్కడికి మళ్లీ మళ్లీ వస్తుంటానని వ్యాఖ్యానించారు. తన కుటుంబంతోపాటు ఇక్కడికి వచ్చి పిల్లలతో అనందంగా గడిపిన మధుర క్షణాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని అని వివరిస్తూ, నిరంతరం ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగుల సంక్షేమం కోసం తాను ఆలోచిస్తూ ఉంటానని తెలిపారు. అందుకే పారా ఒలింపిక్స్లో రాణిస్తున్న, రాణించేందుకు సిద్ధంగా ఉన్న వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందించి భుజం తట్టి మరీ పంపిస్తున్నానని, వారు పతకాలతో తిరిగి వచ్చి వాటిని తనకు చూపించే క్షణాలు మరెంతో ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. సమాజానికి గొప్ప ప్రయోజనాలను ఇలాంటి స్వచ్ఛంద సేవ ద్వారా కనిపిస్తాయని, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు తాను ఒక్కటే చెబుతున్నానని, నమ్మకంగా, దృఢ సంకల్పంతో చదువుకోవాలని, ఉన్నత విద్యను అభ్యషించాలని వివరిస్తూ, ప్రతి విద్యార్థికి తాను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. చదువే కీలకం, ప్రత్యేక ప్రతిభావంతులకు ఎల్ల వేళలా ఈ ద్రావిడ మోడల్ ప్రభుత్వమే కాదు, తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ దయానిధి మారన్, ఎమ్మెల్యే ఎలిళన్ పాల్గొన్నారు.
శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
పిల్లలతో స్టాలిన్
ఆధునిక భవనం
అనంతరం సీఎం స్టాలిన్ ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రణాళిక కింద చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ సెవన్ వెల్స్లో రూ.147కోట్లతో నిర్మించిన అత్యాధునిక వసతులతో కూడిన భవనాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ భవనంలో 776 ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే, వాల్డాక్స్ రోడ్డు, వాటర్ ట్యాంక్ వీధిలో రూ.31 కోట్లతో నిర్మించిన 144 ఫ్లాట్ను కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రులు ఏవీ వేలు, అన్బరసన్, ఎం సుబ్రమణియన్, శేఖర్బాబు, మేయర్ ఆర్ ప్రియ, ఎంపీలు దయానిధిమారన్, కళానిధి వీరాస్వామి పాల్గొన్నారు. అనంతరం తమిళ జాలర్లను శ్రీలంక నౌకాదళం బందీగా పట్టుకెళ్లడాన్ని పరిగణించి, వారిని విడుదల చేయించేందుకు చర్యలు త్వరితగతిన చేపట్టాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు సీఎం స్టాలిన్ లేఖ రాశారు.
ఎల్లవేళలా అండగా ఉంటా!
ఎల్లవేళలా అండగా ఉంటా!


