ఇరుగు పొరుగు
రథ సప్తమి విజయవంతం చేయండి
– టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో ఈ నెల 25వ తేదీన జరగనున్న రథసప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం ఆయన టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలసి జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి రోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలని, టీటీడీ భద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని సూచించారు. రథ సప్తమి రోజున భక్తులకు అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచుకోవాలన్నారు. పుష్కరిణి పరిశీలించి చక్రస్నానం సందర్భంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రథసప్తమి రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతోపాటు అన్ని సేవలు రద్దు చేశామన్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాల్లో శ్రీవారు ఊరేగనున్నట్లు తెలిపారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, తిరుపతి కమిషనర్ మౌర్య, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ పాల్గొన్నారు.


