పశువుల లారీలు స్వాధీనం
పలమనేరు: పుంగనూరు వైపు నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చి కబేళాకు అక్రమంగా తరలుతున్న పశువుల లారీలను బుధవారం పలమనేరు, గంగవరం వద్ద భజరంగ్దళ్, బీజేపీ, టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. పశువులను నాలుగైదు వాహనాల్లో తమిళనాడుకు తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో వారు రోడ్డుపై కాపుకాశారు. రెండు వాహనాలను పట్టుకోగా ఒక వాహనం తప్పించుకున్నట్టు సమాచారం. మరో వాహనాన్ని గంగవరం పోలీసులకు అప్పగించారు. ఇందులోని 32 ఎద్దులను కిందకు దింపి పశుసంరక్షణ కేంద్రానికి పంపే ఏర్పాట్లు చేశారు. మరికొన్ని వాహనాలు వెనక్కి వెళ్లినట్టు భజరంగ్దళ్ నాయకులు తెలిపారు. దీనిపై తిరుపతికి చెందిన భజరంగ్దల్ నేత విష్ణు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పశువుల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనేది కనిపెట్టాలని స్థానిక నాయకులు సత్యప్రకాష్, సిద్ధయ్య, శరవణ కోరారు.
వితరణగా వంట పాత్రలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీగోవిందరాజస్వామి ఆలయానికి నగరానికి చెందిన దాత మురళి బుధవారం రూ.18 లక్షల విలువైన వంట పాత్రలను వితరణగా అందించారు. ప్రసాదాల తయారీ నిమిత్తం సోలా, అర సోలా, పోటు వంట సామన్లను ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతికి అందజేశారు. ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ పద్మప్రియ పాల్గొన్నారు.


