30 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం
తిరుత్తణి: శ్మశానానికి రోడ్డు ఏర్పాటు చేయాలన్న 30 ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కడంతో అరుంధతీ కాలనీ వాసులు ఆర్డీఓను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని కుమారకుప్పం అరుంధతీ కాలనీలో 60 కుటుంబీకులు నివాశముంటున్నారు. శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో పంట పొలాలపై శవాలను తీసుకెళ్లడంలో ఇబ్బందులు పడేవారు. శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలని 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే పంట పొలాలు వుండడంతో దారి ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అరుంధతీ కాలనీ ప్రజల శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలన్న వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది 30 అడుగుల వెడల్పు గల దారి చూపారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి జేసీబీ సాయంతో తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేవారు. త్వరలో నిధులు సమకూర్చి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో హర్షం వ్యక్తం చేసి అరుంధతీ కాలనీ వాసులు మంగళవారం తమ కుటుంబాలతో వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కనిమొళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.


