ఇంటింటికీ వెళ్దాం!
– డీఎంకే కార్యదర్శుల భేటీలో తీర్మానం
సాక్షి, చైన్నె: మళ్లీ అధికారమే లక్ష్యంగా ఇంటింటా ప్రజలలోకి వెళ్లేందుకు డీఎంకే సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన డీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ అధ్యక్షతన జిల్లాల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇందులో నాలుగు తీర్మానాలు చేశారు. ఇంటింటి ప్రచారంలోకి వెళ్దామని, మహిళల మద్దతును కూడగట్టేందుకు పిలుపు నిస్తూ తీర్మానం చేశారు. తమిళ మహిళల ఆదరణతో గెలుద్దాం మళ్లీ నినాదంతో ఇంటింటా కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్టాలిన్ నేతృత్వంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా శ్రమించేందుకు నిర్ణయించారు. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలో గత నెల జరిగిన మహిళా మహానాడు గురించి ప్రస్తావిస్తూ, ఈనెల 26వ తేదిన డెల్టా జిల్లాలలోని మహిళా లోకాన్ని ఏకం చేస్తూ తంజావూరులో మరో మహానాడుకు నిర్ణయించారు. అలాగే ఫిబ్రవరి 1న ప్రారంభమై మార్చి 8వ తేది వరకు ప్రతి పోలింగ్ స్టేషన్కు 10 మంది మహిళలను ఎంపిక చేసి, ఇంటింటా ప్రచారం విస్తృతం చేయడానికి తీర్మానించారు. ఇక తమిళనాడు ఎవ్వరికి తల వంచదు నినాదంతో ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు స్టార్ క్యాంపెయినర్ల ద్వారా జిల్లాలో విస్తృతంగా సమావేశాలు, బహిరంగ సభల నిర్వహనకు నిర్ణయించారు. నా పోలింగ్ కేంద్రం విజయవంతమైన పోలింగ్ కేంద్రం నినాదంతో ఉత్తర జోన్ యువజ మహోత్సవం ఫిబ్రవరి 7వ తేదిన విరుదునగర్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. స్టాలిన్ కొనసాగాలి...తమిళనాడు గెలవాలి నినాదంతో మార్చి 8న తిరుచ్చిలో పది లక్షల మందితో బ్రహ్మాండ సభకు నిర్ణయించారు.


