రైల్వే స్టేషన్కు.. బస్ స్టేషన్ అనుసంధానం
– కీలంబాక్కంలో హైలెవల్ ఫుట్బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి
కొరుక్కుపేట: చైన్నె నగరంలోని వండలూర్లోని కీలంబాక్కం నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు కొత్తగా ఏర్పాటు చేసిన బస్సు స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. అలాగే కీలంబాక్కం బస్ స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. ఇక ప్రయాణికులు సులభంగా చేరుకోవడానికి కొత్త రైల్వే స్టేషన్ కూడా నిర్మించారు. ప్లాట్ఫామ్ నిర్మాణంతో సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం త్వరలో జరుగుతోంది. అయితే, ప్రయాణికులు స్టేషన్ చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి జీఎస్టీ రోడ్డు దాటవలసి వస్తోంది. ఈనేపథ్యంలో రైల్వే స్టేషన్ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.79 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు పనులు పూర్తయినప్పటికీ, 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఫుట్బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజల వినియోగానికి తీసుకువస్తామని తాజాగా అధికారులు తెలిపారు.
ఎన్నూర్లో లిక్విడ్ అమ్మోనియా లీక్పై విచారణ ముమ్మరం
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు
మద్రాసు హైకోర్టు నోటీసులు
కొరుక్కుపేట:చైన్నెలోని ఎన్నూర్లో ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఐఎల్) అమ్మోనియా ప్లాంట్ను సీజ్ చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వివరాలు.. చైన్నెలోని ఎన్నూర్లోని కోరమండల్ ప్లాంట్ ఉంది. ఓడరేవు నుండి ద్రవ అమ్మోనియాను రవాణా చేయడానికి ఓడరేవు వద్ద ఏర్పాటు చేసిన పైప్లైన్ డిసెంబర్ 26, 2023న దెబ్బతింది. దీంతో అమ్మోనియా లీక్ అయింది. ఈ క్రమంలో 52 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం రూ.92 కోట్ల పరిహారం అందించడానికి అంగీకరించింది. కాగా భోపాల్ గ్యాస్ విషాదం లాగే విష వాయువును లీక్ చేస్తున్న అమ్మోనియా ప్లాంట్ను మూసివేయాలని ఆదేశించాలని కోరుతూ తిరువొత్తియూర్ మాజీ ఎమ్మెల్యే కె. కుప్పన్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్లో, ఆ ప్లాంట్లో అమ్మోనియా మార్పిడి, నిల్వ, సంబంధిత ప్రమాదకర కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. 2023లో అమ్మోనియా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన వారికి వెంటనే పూర్తి పరిహారం అందించాలని చైన్నె, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం. శ్రీవాస్తవ, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ లతో కూడిన ధర్మాసనం, ఈ పిటిషన్ పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
గిండిలో ఇంటిగ్రేటెడ్
ట్రాన్స్పోర్టు టెర్మినల్
సాక్షి, చైన్నె: గిండిలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టు టెర్మినల్కు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకోసం 3.48 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. వివరాలు..చైన్నె నగరంలో గిండి కీలక ప్రాంతం. వేళచ్చేరి, తాంబరం, పూందమల్లి, కోయంబేడు, ఓఎంఆర్, ఈసీఆర్ల వైపుగా వెళ్లే రవాణా మార్గాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రాంతం ఉంటున్నది. ఇక్కడే ఎంటీసీ బస్సులు, మెట్రో రైలు, ఎలక్ట్రిక్ రైలు సేవలు కలుస్తుంటాయి. దీని ఆధారంగా గిండిలో మల్టీ మోడల్ రవాణా కేంద్రం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్టు టెర్మినల్కు కసరత్తు చేపట్టారు. ఈ రైల్వే సేషన్ తదుపరి వచ్చే సెయింట్ థామస్ మౌంట్వ ద్ద ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్, మెట్రో రైలు సేవలు మూడు మరి కొన్ని నెలలో అనుసంధానించనున్నారు. వీటన్నింటినీ పరిగణించి గిండి కేంద్రంగా రవాణా కేంద్రం రూపకల్పన కసరత్తులు మొదలయ్యాయి. ఇందుకోసం ఇంటి గ్రేటెడ్ హబ్గా రైలు, మెట్రో, ఎంటీసీ సేవలు ప్రయాణీకులకు అందించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మెట్రో, ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్ సమీపంలో 3.48 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడే అన్నింటిని అనుసంధానించే విధంగా ప్రణాళికను అఽధికారులు సిద్ధం చేసి ఉన్నారు. ప్రస్తుతం ఎంటీసీ బస్సుల కోసం సబ్ వే ఆధారంగా రోడ్డు దాటాల్సి ఉంది. ఈ దృష్ట్యా, ఈ హబ్ ఏర్పాటుతో ఆ ప్రయత్నం ప్రయాణీకులు చేయాల్సిన అవసరం లేదు. మూడు రకాల రవాణా సేవ ఒకే వేదికగా అందించేందుకు సంబంధించిన విస్తృత కార్యచరణను అధికారులు వేగవంతం చేశారు. ఇందు కోసం అయ్యే అంచనా వ్యయం గురించి పరిశీలిస్తున్నారు.


