సూరరై పోట్రు కాంబో రిపీట్?
తమిళసినిమా: సూరరై పోట్రు చిత్రం నేరుగా థియోటర్లలో విడుదల కాకపోయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి విశేష ప్రేక్షకాదరణతో పాటూ, జాతీయ అవార్డులను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరో సూర్య, దర్శకులు సుధా కొంగర. కాగా ఈ చిత్రం తరువాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య ఇంతకు ముందే రెడీ అయ్యారు. దాని పేరు పురనానూరు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం చిత్రీకరణను కూడా జరుపుకుంది. ఆ తరువాత అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలగారు. ఆ తరువాత అదే కథతో నటుడు శివకార్తికేయన్ హీరోగా పరాశక్తి పేరుతో సుధా కొంగర తెరకెక్కించారు. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో దర్శకులు సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. కాగా తాజాగా మరోసారి సూర్య, దర్శకులు సుధా కొంగర కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే నటుడు సూర్య ప్రస్తుతం తన 46, 47 చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 46వ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ, 47వ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి పాండిరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం ఎప్పుడు అన్నది ఆసక్తిగా మారింది.


