71 జిల్లాలకు కాంగ్రెస్ కొత్త అధ్యక్షులు
సాక్షి,చైన్నె: టీఎన్సీసీలో జిల్లాల అధ్యక్షులు, ఇతర కమిటీ నియమాక కసరత్తుల జాబితా వెలు వడింది. తొలుత 71 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. తమిళనాడు కాంగ్రెస్లో పార్టీ పరంగా 77 జిల్లాల ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 10 జిల్లాలకు అధ్యక్షులు లేరు. మిగిలిన జిల్లాలకు పది నుంచి 15 సంవత్సరాల పాటుగా పాతుకు పోయిన వారే ఉంటూ వచ్చారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న నినాదం గత కొంత కాలంగా మిన్నంటుతూ వచ్చింది. ఈనేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సెల్వ పెరుంతొగై పగ్గాలు చేపట్టినానంతరం జిల్లా కమిటీలలో మార్పునకు సంబంధించిన కసరత్తు చేపట్టారు. అయితే, ఏఐసీసీ ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల దృష్ట్యా, ఆయా గ్రూపుల నుంచి ప్రతినిధులతో జిల్లా కమిటీల ఎంపికకు ఓ కమిటిని ఏఐసీసీ నియమించింది. మొత్తం 35 మంది తోకూడిన ఈ కమిటీ జిల్లాల కమిటీ నిర్వాహకుల ఎంపికపై దృష్టి పెట్టింది. నాలుగు వారాల పాటూ ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. జిల్లాల వారీగా పదవుల ఎంపిక జాబితాను సిద్ధం చేసింది. అయితే, అనేక కీలక జిల్లాలలో పదువులకు నోట్ల భేరం సాగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పలుజిల్లాలోని నేతలు స్పందించడం మొదలెట్టారు. పదువులకు లక్షలలో భేరం అంటూ కొన్ని జిల్లాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు సామాజిక మాధ్యమాలలో విమర్శించడం వివాదానికి దారి తీసింది. ఈపరిస్థితులలో 6 వేల మంది పేర్లతో ఈ కమిటీ జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి తీసుకెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశం వద్దకు జాబితా చేరింది. దీంతో పార్టీ పరంగా ఉన్న జిల్లాలో 71 జిల్లాలకు అధ్యక్షుల జాబితాను సోమవారం ప్రకటించారు. ఇందులో గతంలో పనిచేసిన వారిలో 8 మందికి మాత్రమే మళ్లీ అవకాశం ఇచ్చారు. మిగిలిన వారంతా కొత్త వాళ్లు. అలాగే, నాలుగు జిల్లాలకు మహిళలను అధ్యక్షులుగా నియమించడం విశేషం. మరో ఆరు జిల్లాలకు అధ్యక్షుల నియమాకాన్ని పెండింగ్లో పెట్టారు.


