ప్రజల్లోకి డీఎంకే కమిటీ
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నిల ద్వారా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు డీఎంకే వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజల వద్దకు డీఎంకే కమిటీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కృష్ణగిరి జిల్లా హోసూరులో ప్రజల అభిప్రాయాలను, సూచనలను డీఎంకే కమిటీ ఆలకించింది. ఎన్నికలలోకి వెళ్లే రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో అన్నది కీలకం అన్న విషయం తెలిసిందే. వారు ఇచ్చే వాగ్దానాలే ఓటర్లకు కీలకంగా చెప్పవచ్చు. తాజాగా మళ్లీ అధికారం కోసం డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ అధికారం లక్ష్యంగా ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వం అన్న నినాదాన్ని సీఎం స్టాలిన్ అందుకున్నారు. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టారు. ఇందు కోసం పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి నేతృత్వంలో మంత్రులు కోవి చెలియన్, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, టీఆర్బీ రాజ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, మైనారిటీ నేత ఎంఎం అబ్దుల్లా, అనుబంధ విభాగాలకు చెందిన నేతలు రవీంద్రన్, ఎలిళన్ నాగనాథన్, కార్తికేయ శివ సేనాధిపతి, తమిళరసి రవికుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం, వ్యాపార రంగానికి చెందిన దురై సంబంధంతో కూడిన కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ విస్తృత కార్యాచరణలో దూసుకెళున్నది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సామాజిక మాధ్యమాలలోని అనేక రకాల వెబ్ సైట్లను ఉపయోగించి సైతం అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాల సేకరణకు శ్రీకారం చుట్టారు. హోసూరులో జరిగిన అభిప్రాయ సేకరణలో రైతులు, వివిధ వర్గాల ప్రజలు, వివిధ రంగాలకుచెందిన వారు తమ సూచనలు, సలహాలు ఇచ్చిరు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు లఖిత పూర్వకంగా సైతం సూచనలు, మరి కొందరు స్థానిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు సైతం సిఫారసు చేయడం విశేషం. ఈ ప్రజాభిప్రాయ సేకరణ పర్యటన విస్తృతం కానుందని, మరిన్ని జిల్లాలలు, నగరాలలో కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కనిమొళి పేర్కొన్నారు.


