నేటి నుంచి సభా పర్వం
సాక్షి, చైన్నె: 2026 సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. తొలి రోజున ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి సభలో చదివి వినిపిస్తారా? అన్న చర్చ ఊపందుకుంది. ఏటా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలుప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్గా ఆర్ఎన్ రవి కొనసాగుతుండడంతో ఏటా డీఎంకే ప్రభుత్వంతో సమరం తప్పడం లేదు. ప్రభుత్వ ప్రసంగాన్ని ఆయన పక్కన పెట్టడం వంటి చర్యలకు పాల్పడటం జరుగుతోంది. గవర్నర్, ప్రభుత్వం మధ్య అసెంబ్లీ వేదికగా ఏటా వివాదాలు తప్పడం లేదు. తాజాగా కొత్త సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వేళ జరగబోతున్న తొలి సమావేశంలో గవర్నర్ ఎలా వ్యవహరించ నున్నారో అన్న చర్చ మొదలైంది. ఇందుకు కారణం సోమవారం అసెంబ్లీని సమావేశ పరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే. ఉదయం 9.30 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఇప్పటికే స్పీకర్ అప్పావు ప్రకటించారు. కేబినెట్ భేటీలో సైతం గవర్నర్ ప్రసంగానికి ఆమోద ముద్రను వేశారు. అయితే ప్రభుత్వం సిద్ధం చేయించి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని సభకు గవర్నర్ చదివి వినిపించేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఆయన సభను గౌరవిస్తారని భావిస్తున్నట్టు ఇప్పటికే స్పీకర్ అప్పావు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం తదుపరి అసెంబ్లీ వ్యవహారాలకమిటీ సమావేశమై, సభను ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయించనుంది. అసెంబ్లీ ఎన్నికల నగారా ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో మోగే అవకాశాల నేపథ్యంలో ఈ సమావేశాలలోనే తాత్కాలిక బడ్జెట్ను దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో సభను నాలుగు లేదా ఐదు రోజులు నడిపించే అవకాశాలు ఉన్నాయి.


