కోర్టును ఆశ్రయించిన రామన్న!
సాక్షి, చైన్నె: పీఎంకేను నకిలీ రికార్డులతో అన్బుమణి హైజాక్ చేస్తున్నారన్న ఆవేదనతో కోర్టును ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ఆశ్రయించారు. సోమవారం ఆయన తరపున సివిల్ పిటిషన్ దాఖలైంది. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య సాగుతున్న వివాదం గురించి తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తొలగించారు. తానే అధ్యక్షుడ్ని అంటూ ఓ వైపు అన్బుమణి నేతృత్వంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించి కేంద్ర ఎన్నికల కమిషన్కు తీర్మానాలు పంపించారు. కాగా పార్టీకి తానే వ్యవస్థాపక అధ్యక్షుడ్ని అంటూ రాందాసు నేతృత్వంలో ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి తీర్మానాలను ఎన్నికల కమిషన్కు పంపించారు. అలాగే, అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్గా రాందాసు నియమించారు. అదే సమయంలో అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన చర్చకు దారి తీసింది. ఇక పీఎంకే తన గుప్పెట్లో అని అన్బుమణి ప్రకటించుకున్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టును రాందాసు ఆశ్రయించినా ఫలితం శూన్యం. అదే సమయంలో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకేతో తమ కూటమి అని అన్బుమణి ప్రకటించడాన్ని రాందాసు జీర్ణించుకోలేక పోయారు. తీవ్ర ఆగ్రహంతో ఉంటూ వస్తున్న ఆయన తాజాగా అన్బుమణికి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు సమాచారాలు, నకిలీ రికార్డుల ఆధారంగా పీఎంకేను అన్బుమణి హైజాక్ చేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీని రక్షించి తనకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టును రాందాసు పిటిషన్ ద్వారా విన్నవించారు. కాగా రాందాసు నేతృత్వంలో ఎన్నికలలో పోటీ చేయడానికి ఇచ్చిన పిలుపు మేరకు ఆశావహులు 4,109 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈసందర్భంగా రాందాసు మీడియాతో మాట్లాడుతూ, అన్బుమణి కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని, కోర్టే ఆయనపై చర్యలు తీసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నట్టు వ్యాఖ్యానించారు.


