నిజాయితీకి ఘన సన్మానం
– దొరికిన నగలను అప్పగించిన
పారిశుధ్య కార్మికురాలికి ఘన సత్కారం
తిరువొత్తియూరు: తమిళనాడులో వారం క్రితం రోడ్డుపై తనకు దొరికిన 45 సవర్లు నగలను పోలీసులకు అప్పగించిన మహిళా పారిశుధ్య కార్మికురాలిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాలు.. చైన్నె నగర కార్పొరేషన్ పారిశుధ్య కార్మికురాలు పద్మావతి త్యాగరాయనగర్లో రోడ్డుపై పడి ఉన్న 45 సవర్ల బంగారు నగలను పోలీసులకు అప్పగించారు. కాగా ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ రూ. లక్ష బహుమతి అందజేసి అభినందించారు. అలాగే లలితా జ్యువెలరీ యజమాని కిరణ్కుమార్, పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని తన ఇంటికి పిలిపించి బహుమతి ఇచ్చి సత్కరించారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తులు కొందరు చైన్నె అన్నా నగర్ టవర్ క్లబ్లో జరిగిన పొంగల్ వేడుకకు పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని కుటుంబంతో సహా ప్రత్యేక అతిథిగా పిలిచి సత్కరించారు. ఆమెకు క్లబ్ తరపున రూ. 1.25 లక్షల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇబ్రహీం ఖలీలుల్లా, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బాషా, క్లబ్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు పి. రంగనాథన్ (తమిళనాడు వేర్ హౌసింగ్ ప్రెసిడెంట్) అందజేసి గౌరవించారు.
నిజాయితీకి ఘన సన్మానం


