కూవంలో 46 విగ్రహాల వెలికితీత
– రెవెన్యూ, పోలీసు శాఖ విచారణ
తిరువళ్లూరు: కూవం నదిలో 46 రాతి విగ్రహాలు బయట పడడం చర్చినీయాంశంగా మారింది. నదిలోకి విగ్రహాలు ఎలా వచ్చాయన్న కోణంలో రెవెన్యూ శాఖ, కడంబత్తూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పింజివాక్కం గ్రామానికి సమీపంలో కూవం నది ప్రవహిస్తుంది. ఇక్కడ పింజివాక్కం నుంచి కడంబత్తూరు పేరంబాక్కం ప్రాంతాలకు వెళ్లడానికి నిర్మించిన బ్రిడ్జి వుంది. ఆదివారం ఉదయం పింజివాక్కం గ్రామానికి చెందిన ఏలుమలై అనే వ్యక్తి కూవం నది వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఏలుమలైకి నీటిలో రాత్రి విగ్రహాలు కనబడడంతో స్థానికులకు సమాచారాన్ని ఇచ్చాడు. సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు, గ్రామానికి చెందిన యువకులు నీటిలో వున్న వినాయకుడు, అయ్యప్ప, మురుగన్, అమ్మవారు, నాగపాము, నాగదేవత, గరుడర్ సహా 46 విగ్రహాలను గుర్తించి వాటిని నీటి నుంచి వెలికి తీశారు. విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. కొంతమంది విగ్రహాలకు పూజలు చేశారు. కడంబత్తూరు పోలీసులకు, తిరువళ్లూరు తహసీల్దార్కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, అధికారులు రాతి విగ్రహాలను స్వాధీనం చేసుకునే అంశంపై స్థానికులతో చర్చలు జరుపుతున్నారు.


