వైభవంగా వీరరాఘవుని గరుడసేవ
● గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు
తిరువళ్లూరు: వైద్య వీరరాఘవుడి ఆలయంలో జరుగుతున్న తైమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయం వుంది. ఇక్కడ ఏటా తైమాసంలో బ్రహ్మోత్సవాలను పది రోజుల పాటూ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శనివారం ఉదయం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు అందుకుని మాడవీధుల్లో ఊరేగారు. గరుడసేవ ముగిసిన తరువాత మూడుగంటలకు స్వామి వారికి తిరుమంజనం నిర్వహించి రాత్రి 8 గంటలకు హనుమంత వాహన సేవను నిర్వహించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కాగా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాధాలను అందజేశారు.
ఢిల్లీకి టీఎన్సీసీ నేతలు
సాక్షి, చైన్నె : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, లోక్సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ నిమిత్తం టీఎన్సీసీ నేతలు ఢిల్లీకి శనివారం బయలుదేరి వెళ్లారు. డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం విషయంగా చర్చించేందుకు ఈ భేటీ ఢిల్లీలో జరుగనుంది. టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్కుమార్తో పాటూ ముఖ్య నేతలు, ఎన్నికల వ్యవహారాల కమిటీ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధీ ఇచ్చే సూచనలు, సలహాల మేరకు తదుపరి డీఎంకేతో సీట్ల పందేరం గురించి చర్చించనున్నారు.
మట్టి చరియలు విరిగిపడి..
సాక్షి, చైన్నె: బావి తవ్వకాల సమయంలో మట్టి చరియలు విరిగి పడటంతో ముగ్గురు కార్మికులు మరణించారు.నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని జగదార్ ప్రాంతంలో ఓ ప్రైవేటు స్థలంలో బావి తవ్వకాల పనులు జరుగుతున్నాయి. శనివారం సుమారు 10 మందికి పైగా కార్మికులు ఇక్కడి తవ్వకాల పనులలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం సమయంలో హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులలో ఆందోళన నెలకొంది. కొందరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మరి కొందరు అతి కష్టంమీద బయటపట్టారు.అయితే, పదిలోపు అడుగుల లోతులో ఉన్న ముగ్గురిపై మట్టి చరియలుపడ్డాయి. వీరిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి వారి మృత దేహాలను బయటకు తీశాయి. మృతులు రెహ్మాన్(25), నజీర్(39), ఉస్మాన్(40)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన కున్నూరు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
3 అమృత్ భారత్ రైళ్లు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని పలు నగరాల నుంచి ఉత్తరాదిలోని అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అమృత్ భారత్ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. అసోంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కొత్త రైలు సేవలకు జెండా ఊపారు. ఈ మేరకు చైన్నె తాంబరం నుంచి చంద్రకాశి, తిరుచ్చి – జల్పై గురి, నాగర్కోయిల్ – జల్పైగురి మధ్య ఈ అమృత్భారత్ రైలు సేవలకు చర్యలు తీసుకున్నారు.
కమనీయం..
సుబ్రహ్మణ్య స్వామి విహారం
పళ్ళిపట్టు: ముక్కనుమ సందర్భంగా, తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పట్టణ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. సంక్రాంతి వేడుకల్లో చివరి రోజైన ముక్కనుమ సందర్భంగా ఏటా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లు పట్టణ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం పరిపాటి. ఆ ప్రకారం ముక్కనుమ సందర్భంగా శనివారం ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత ఉత్సవర్లు శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి పల్లకి మోసే కార్మికుల ఆధ్వర్యంలో స్వామికి ఎండుద్రాక్ష, ముంతమామిడి పప్పు, కర్జూర పండ్లు, ఏలకలు సహా నవ మూలికలతో విశేష అలంకరణ చేపట్టి మెట్ల మార్గంలో స్వామి కొండ దిగివచ్చారు. సన్నిధి వీధిల్లో వాహన సేవలో కొలువు దీరిన స్వామిని పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్త జనం కర్పూర హారతులిచ్చి స్వామి దర్శనం చేసారు. రాత్రి షణ్ముగ తీర్ధగుంట వద్ద అభిషేక పూజతో అలంకరించి దర్శించుకున్నారు. రాత్రి స్వామి కొండ ఆలయానికి చేరుకున్నారు.
వైభవంగా వీరరాఘవుని గరుడసేవ


