ఇద్దరు ముద్దుగుమ్మలతో..!
తమిళసినిమా: ఒకే సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించటం కొత్తమే కాదు. కథ డిమాండ్ చేస్తే ముగ్గురి కంటే ఎక్కువ మంది కూడా నటిస్తారు. అలా యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నారీ నారీ నడుమ మురారిగా మారబోతున్నట్లు తాజా సమాచారం. ముందు దర్శకుడిగా అవతారం ఎత్తి రవి మోహన్ హీరోగా కోమాలి చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన ప్రదీప్ రంగనాథన్ ఆ వెంటనే లవ్ టుడే చిత్రంతో హీరోగా అవతారం ఎత్తి స్వీయ దర్శకత్వం వహించి మరో హిట్ కొట్టారు. ఆ తరువాత ఈయన నటించిన డ్రాగన్ చిత్రం సంచలన విజయం సాధించింది. అందులో ఆయనతో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. కాగా తాజాగా డ్యూడ్ అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టొరీలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్తో జత కట్టిన హీరోయిన్లు క్రేజీ ఆఫర్స్ అందుకోవడం విశేషం. కాగా ఈ యువ నటుడు, దర్శకుడు తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని ఇంతకు ముందు లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు ఇటివల పరాశక్తి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీల అనీ, మరోకరు లక్కీ భాస్కర్ చిత్రం ఫేమ్ మీనాక్షి చౌదరి అని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే హీరోయిన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ మాత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఇకపొతే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం ఫిబ్రవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
నటీ మీనాక్షి చౌదరి
ఇద్దరు ముద్దుగుమ్మలతో..!


