
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు సహించం
● సీమాన్పై తెలుంగర్
మున్నేట్రకళగం హెచ్చరిక
కొరుక్కుపేట: తమిళనాడులోని తెలుగు ప్రజలను భయపెట్టే రీతిలో, సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరంగా మాట్లాడుతున్న నామ్ తమిళర్ కట్చినిర్వాహకుడు సీమాన్ మాట్లాడడం తగదని, ఇలాగే మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుంగర్ మున్నేట్ర కళగం అధ్యక్షుడు పుగళ్ బాలాజీ హెచ్చరించారు. ఆదివారం ఉదయం చైన్నె ట్రిఫ్లికేన్లోని శివానందం సాలై వద్ద తెలుంగర్ మున్నేట్ర కళగం తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ద్రావిడ తెలుగుదేశం కట్చి మునిఆరుముగం, వీరపాండ్య కట్టబొమ్మన్ పేరవై ఇళయా కట్టబొమ్మన్, నాయుడు–నాయకర్ పేరవై డాక్టర్ యోగి జయకుమార్, తిరువన్నమలై నాయుడు సంఘం సెల్వరాజ్, కాళిరాజ్తోపాటు 200మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, తెలుగు ప్రజలు పాల్గొని సీమాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో తెలుగు, తమిళం అన్న తేడా లేకుండా అన్నదమ్ములుగా జీవిస్తున్నారని, అయితే సీమాన్ మాత్రం తెలుగు ప్రజలను భయపెట్టే రీతిలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీమాన్తోపాటు నకిలీ తమిళ జాతీయ వాదులపై చర్యలు తీసుకోవాలని, వారి సామాజిక మాధ్యమాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాగే మదురై జిల్లా తిరుమంగళం కప్పలూరులో హైవే శాఖ తరఫున తొలగించిన స్వాతంత్య్ర సమరయోధులు వీరపాండ్య కటబొమ్మన్ విగ్రహాన్ని మళ్లీ అదే స్థానంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు .