కరోనా కలవరం: ఒక్క రోజు 76 పాజిటివ్‌ కేసులు

- - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజు 76 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కట్టడి చర్యలు విస్తృతం చేయడానికి మంగళవారం ఆరోగ్య అధికారులతో మంత్రి ఎం. సుబ్రమణియన్‌ సమావేశం నిర్వహించారు. వివరాలు.. ఈనెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో హెచ్‌3 ఎన్‌2 ఇంప్లూయెంజా వైరస్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. జ్వరం, జలుబు, గొంతు నొప్పి, వంటి సమస్యలతో జనం అవస్థలు పడ్డారు.

ఇప్పుడిప్పుడే ఇంప్లూయెంజా ప్రభావం తగ్గుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు అమాంతంగా పెరుగుతుండడం కలవరం రేపుతోంది. గత వారం వరకు ఒకటి రెండు అన్నట్టుగా ఉన్న కేసులు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం 76 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో చైన్నె శివారు జిల్లాలు, కోయంబత్తూరులలో మరీ ఎక్కువగా ఉన్నాయి. కేసులు పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మేల్కొంది. ముందు జాగ్రత్తల విస్తృతంతో పాటుగా ఆసుపత్రులలో ఉన్న సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లపై ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్‌ సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.

ఆందోళన వద్దు..
ఈ సమీక్ష అనంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్‌ మాట్లాడుతూ, వారంలో 35 వేల మందికి కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే, ఒకేరోజు అధికంగా కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్తలపై దృష్టి పెట్టామన్నారు. ఆస్పత్రులలో అన్ని రకాల వైద్య సేవలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. 2 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిల్వ ఉన్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

చైన్నె, చెంగల్పట్టు, కోయంబత్తూరు, తిరుప్పూర్‌ జిల్లాలలో ప్రస్తుతం రెండు అంకెల మేరకు కేసులు నమోదయ్యాయని, ప్రజలు కరోనా కట్టుబాట్లను అనుసరించి, తమను తాము రక్షించుకోవాలని ఆయన జూనియర్లు, సూచించారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వైరస్‌ మరింత విస్తరించకుండా ప్రజలు సహకారం అందించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు :

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top