● ‘ఐ గాట్ కర్మయోగి’ పేరుతో ఉద్యోగులపై పెత్తనం
● నైపుణ్య శిక్షణ ముసుగులో కార్పొరేట్ దందా
● జీతాల కోత?
కార్పొరేట్ అనుకూలత..
కమీషన్ల గుసగుసలు
పనితీరును మెరుగుపరచని ఇలాంటి ఆన్లైన్ వేదికల వెనుక భారీ ఎత్తున నిధుల మళ్లింపు, సాంకేతిక ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నా యి. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల అండ దండలతోనే ఇలాంటి ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్నాయని, ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం: పాలన వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం అనే ఆకర్షణీయమైన నినాదంతో కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన ‘మిషన్ కర్మయోగి’ వేదిక ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ప్రజాధనంతో ఏర్పాటైన ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను క్షేత్రస్థాయి పరిస్థితు లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతుండటం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
నైపుణ్య సాధనా? లేక నిబంధనల ఉచ్చులా?
కేంద్ర సివిల్ సర్వెంట్లు, వివిధ శాఖల సిబ్బందికి నిరంతర ఆన్లైన్ శిక్షణ అందించడమే దీని ప్రధాన లక్ష్యమని పాలకులు చెబుతున్నారు. కానీ వాస్తవంలో ఇది ఒక రొటీన్ ఆన్లైన్ మాడ్యూల్ తప్ప, కింది స్థాయి ఉద్యోగులైన రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామ/వార్డుసచివాలయాల ఉద్యోగుల క్షేత్రస్థాయి విధులకు ఎంతవరకు అక్కరకొస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. రాష్ట్ర పాలనా వ్యవస్థకు, ఇక్కడి స్థానిక సమస్యలకు సంబంధం లేని కోర్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మెడ కు చుట్టడంపై ఉద్యోగ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది.
జీతాలతో ముడిపెడతారా..
‘ఐ గాట్ కర్మయోగి’ యాప్లో కోర్సులు పూర్తి చేయకపోతే నెలాఖరున జీతాలు ఆపేస్తామంటూ ప్రభుత్వం జారీ చేస్తున్న ఆదేశాలు ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు, యాప్ల భారం, ఆన్లైన్ నివేదికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉద్యోగులపై ఈ అదనపు భారం మోపడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ప్రజలకు అందించాల్సిన నిత్యావసర సేవలను పక్కనపెట్టి, మొబైల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కోర్సులు క్లిక్ చేయాలని ఒత్తిడి తేవడం పాలనా లోపానికి నిదర్శనమని సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భావజాల వ్యాప్తికి సాంకేతిక ఎత్తుగడ?
పాలనా నైపుణ్యాల కంటే కూడా, కేంద్రంలోని పా లకుల భావజాలాన్ని, కేంద్రీకృత ఆలోచనా విధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న యంత్రాంగంపై జొప్పించేందుకే ఈ విధమైన వేదికలను విస్తరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఉద్యోగులకు నిజమైన నైపుణ్యం కావాలంటే క్షేత్రస్థాయి శిక్షణ, వనరుల కల్పన ముఖ్యం తప్ప, ఇలా జీతాలను బంధించి ఆన్లైన్ వీడియోలు చూడాలని బలవంతం చేయడం నిరంకుశ పోకడే. ఉద్యోగులను తీవ్ర అసహనానికి గురిచేస్తున్న ఈ బలవంతపు కోర్సుల విధానాన్ని ప్రభుత్వం తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉంది.


