వజ్రపుకొత్తూరు రూరల్: రాఖీ పండగ రోజున ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పలాస మండలం చినమామిడి మెట్ట గ్రా మానికి చెందిన కూరగాయల చిరు వ్యాపారి చెల్లూరి బైరాగి(75) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైరాగి ప్రతి రోజు తన ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగానే ఆయన శుక్రవారం తన కూరగాయల బండితో ఇంటి నుంచి బయల్దేరారు. తన భార్య దమయంతితో కలిసి గ్రామం నుంచి పలాస వస్తుండగా ఎన్హెచ్–16 జాతీయ రహదారిపై మాకన్నపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో బైరాగి అక్కడికక్కడే మృతి చెందగా భార్య దమయంతి తీవ్ర గాయాలకు గురైంది. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


