వజ్రపుకొత్తూరు రూరల్:
మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పూడిగల్లి వద్ద ఆర్అండ్బీ డబుల్ రోడ్డు పరిస్థితి నరకానికి నకలుగా మారింది. బెండి నుంచి నువ్వలరేవు వరకు ఈ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపైన తేలిన రాళ్లతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తు వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. అలాగే ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రయాణం చేస్తున్న సమయంలో దుమ్ము, ధూళి ఎగిరి ఇళ్లలోకి చేరుతుండడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని రోడ్డు పక్కన నివాసముంటున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.23 కోట్లు వ్యయంతో రేగిలిపాడు నుంచి బెండి మీదుగా నువ్వలరేవు వరకు డబుల్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అదే ప్రభుత్వ హయాంలో దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం బెండి నుంచి నువ్వలరేవు వరకు మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతవరకు పనులు హడావుడిగా చేసి అర్ధాంతరంగా వదిలివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.


