శ్రీకాకుళం అర్బన్: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్మోహనరావు అన్నారు. శ్రీకాకుళంలోనే ఓ ప్రైవేటు అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలలో బీసీ కులాల నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా బొత్స సత్యనారాయణ ఎదిగారని చెప్పారు. అటువంటి వ్యక్తిపై మంత్రి వ్యాఖ్యలు చేయడం జుగుప్సాకరమన్నారు. అధికార, ప్రతిపక్ష సీనియర్ రాజకీయ నాయకులు గౌరవించే వ్యక్తి బొత్స అని గుర్తు చేశారు. రాజకీయాలు దిగజారుతున్న సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉండాలని, ఇటువంటి వ్యాఖ్యలతో జిల్లా పరువును దిగజార్చవద్దని హితవు పలికారు. లుకలాపు లక్ష్మణరావు, బొడ్డేపల్లి రాజగోపాలరావు, గొర్లె శ్రీరాములునాయుడు, కింజరాపు ఎర్రన్నాయుడు, గుండ అప్పలసూర్యనారాయణ వంటి నాయకులు నీతీ, నిజాయితీతో పాటు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, నిరుద్యోగం, వ్యవసాయ రంగ సమస్యలపై, శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పి గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలని కోరారు.


