పోలాకి : గౌరవమైన మంత్రిపదవిలో ఉంటూ సభలో పెద్దలను గౌరవించే పద్ధతి ఇదేనా..? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మంత్రి అచ్చెన్నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఇంతకన్నా దిగజారుడు మార్గం మీకు దొరకలేదా..? అని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర బీసీ బిడ్డగా, కాపు నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన బొత్స సత్యనారాయణను అవమానిస్తే అది వెనుకబడిన వర్గాలందరికీ అవమానించినట్టేనని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల పరిషత్ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, యువజన విభాగం అధ్యక్షుడు రెంటికోట త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.


