● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
అరెస్టుపై భగ్గుమన్న ధర్మాన ప్రసాదరావు
ప్రశ్నిస్తే జైళ్లే సమాధానమా..!
శ్రీకాకుళం రూరల్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యంలో సరికాదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. రోడ్డు ప్రమాద ఘటనలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని ధ్వజమెత్తారు. బుధవారం పెదపాడులోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ధర్మాన మాట్లాడారు. జిల్లాలో మత్స్యకార వర్గానికి ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర చాలా పరిమితంగా ఉందని, వారి హక్కుల కోసం పోరాడిన సందర్భాల్లో వేధింపులు ఎదురైన ఘటనలు కూడా ఉన్నాయని, ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలపై సమర్థంగా పోరాడే స్థాయికి ఎదిగిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమన్నారు.
రోడ్డు ప్రమాద ఘటనను ఆధారంగా చేసుకుని కుమారుడి భవిష్యత్తును దెబ్బతీయడం ప్రజలు అంగీకరించే చర్య కాదని అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, కిల్లి సత్యనారాయణ, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు


