‘కుళాయిల ద్వారా నీరు వచ్చి ఇప్పటికి మూడు రోజులయ్యింది. ఈ రోజైనా నీరు వస్తుందో రాదో.. ఇంకెన్ని రోజులు ఇలా ఎదురుచూడాలో..’ మేజరు పంచాయతీ నరసన్నపేటలో ఏ ఇద్దరు గృహిణులు కలిసినా వారి మధ్య వచ్చే మాటలివే. సుమారు 5600 కుటుంబాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. దేవాది నుంచి నరసన్నపేటకు వచ్చే మెయిన్ పైపులైన్ పాడైపోయిందని, గురువారం నాటికి మరమ్మతులు పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని సిబ్బంది అంటున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది మహిళలు కుళాయిల వద్ద వేచి ఉంటున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కుళాయి వద్ద బిందెలతో వేచి ఉన్న మహిళలను ఈ చిత్రంలో చూడొచ్చు.
– నరసన్నపేట


