నీరు రాదోయి!
ఖాళీ కుళాయి..
● మూడు నెలలుగా టి.బరంపురం పంచాయతీకి అందని తాగునీరు ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని టి.బరంపురం పంచాయతీ పరిధిలో ఉన్న కొత్త శాసనాం, పాత శాసనాం, టి.బరంపురం గ్రామ ప్రజలు మూడు నెలలుగా మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసినా, వాటి నుంచి నీటి చుక్క కూడా రావడం లేదని పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్ల నుంచి స్వచ్ఛమైన నీరు రాకపోవడం, కుళాయిలు బంద్ కావడంతో పక్కింటి మోటారు బోర్లను ఆశ్రయిస్తున్నారు. పి.శాసనాం ప్రజలు స్థానిక బహుదా నదిలోని నీటిని అవసరాల కోసం వాడుకునే పరిస్థితి నెలకొంది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమేనని గ్రామ సర్పంచ్ కారంగి త్రినాథ్రెడ్డి వాపోయారు. ఎండాకాలం వస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. కనీసం తాత్కాలికంగా అయినా నీటి సరఫరా పునరుద్ధరించాలని, జల్ జీవన్ మిషన్, ఉద్దానం రక్షిత మంచినీటి పథకం కాగితాలకే పరిమితం చేయకుండా కార్యరూపం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మూడు నెలల నుంచి ఉద్దానం మంచినీరు రావడం లేదు. పలుమార్లు సర్పంచ్కు ఫిర్యాదు చేశాం. తాగేందుకు పక్కింటి వారిని బతిమలాడుకుంటున్నాం. ఇంటింటికీ కుళాయి నుంచి ఇప్పటి వరకు చుక్క నీరు కూడా రాలేదు. అధికారులు స్పందించి నీరు ఇప్పించాలి.
– బి.ధనలక్ష్మి, కె.శాసనాం
పంచాయతీకి ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు రాక సుమారు వంద రోజులవుతోంది. పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాలు చేసినా స్పందించడం లేదు. మూడు గ్రామాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
– కారంగి త్రినాథ్, సర్పంచ్, టి.బరంపురం
టి.బరంపురం పంచాయతీకి తాగునీరు అందడం లేదన్న విషయం మా సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా తక్షణమే పైప్లైన్ మరమ్మతులు చేపట్టి రెండు రోజుల్లో పంచాయతీ ప్రజలకు తాగునీరు ఇప్పించేందుకు కృషి చేస్తాం.
– చైతన్య, జేఈ.
ఉద్దానం రక్షిత మంచినీటి పథకం
నీరు రాదోయి!
నీరు రాదోయి!
నీరు రాదోయి!


