తప్పిదం... యాతన.. విముక్తి
వజ్రపుకొత్తూరు రూరల్: కంచెలో ఇరుక్కున్న ఎలుగు, బయట పడేందుకు అది పడిన యాతన, దాన్ని బయటకు తీసేందుకు పొద్దంతా సాగిన ఆపరేషన్ భల్లూకంతో ఉద్దానం ఉలిక్కిపడింది. మండలంలోని చీపురపల్లి పంచాయతీ పరిధిలో గల అనకాపల్లి పరిసర జీడి తోటల్లో రైతులు పంట రక్షణకు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఓ భల్లూకం శనివారం రాత్రి ఇరుక్కుంది. శనివారం రాత్రి తల్లి ఎలుగుబంటితో కలిసి రెండు పిల్ల ఎలుగులు జీడి తోటల్లో సంచరిస్తూ అటుగా రాగా.. పిల్ల ఎలుగు ఇసుప కంచెల్లో ఇరుక్కుపోయింది. బయటపడేందుకు రాత్రంతా ప్రయత్నించిన ఆ ఎలుగు పిల్ల బయటకు రాలేక నరకం చూసింది. ఆదివారం ఉదయం రైతులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.వెంకటేష్ పర్యవేక్షణలో ఆపరేషన్ భల్లూకం చేపట్టారు.
ఆపరేషన్ భల్లూకం సాగిందిలా..
● ఎలుగు ఇనుప కంచెలో చిక్కిందన్న వార్తను విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడ నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వైద్య నిపుణులు పి.భానుబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
● ఉదయం 7 గంటల నుంచి ఎలుగు కదలికలను పరిశీలించిన అధికారులు ముందుగా విశాఖ జూ వైద్యులు సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటికే తల్లి ఎలుగు మరో పిల్ల వెళ్లిపోయాయి.
● అదుపులోకి వచ్చిన ఎలుగు గాయాలతో ఉండటంతో వైద్య చికిత్సలు అందించి ఎట్టకేలకు సురక్షితంగా బోనులో బంధించి విశాఖపట్నం జూకి తరలించారు.
● ఈ ప్రక్రియ అంతా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది.
● ఆపరేషన్ భల్లూకంలో సబ్ డీఎఫ్ఓ ఏవీ నాగేంద్ర, ఫారెస్ట్ రేంజర్ ఎ.మురళీకృష్ణంనాయుడు, ఫారెస్టు సిబ్బంది, జూ సిబ్బంది పాల్గొన్నారు.
బాబోయ్ భల్లూకాలు..
ఉద్దానంలో భల్లూకాల అలజడి తగ్గడం లేదు. జీడి తోట పనుల సమయంలో ఎలుగులు సంచరించడంతో రైతులకు మళ్లీ భయం పట్టుకుంది. అయితే ఎలుగుల భయం ఒకవైపు వెంటాడుతుంటే మరో వైపు కంచెకు చిక్కిన ఎలుగును చూసి భయపడినా అధికారులు బంధించడంతో ఈ ప్రాంత వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
కంచెలో ఇరుక్కున్న ఎలుగు పిల్ల
రాత్రంతా నరకయాతన
ఆపరేషన్ భల్లూకం చేపట్టిన అటవీ శాఖాధికారులు
సురక్షితంగా విశాఖ జూకి తరలింపు
తప్పిదం... యాతన.. విముక్తి
తప్పిదం... యాతన.. విముక్తి


