ప్రశాంతి నిలయం: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలను వీలైనంత త్వరగా ఉత్పత్తి దశకు తీసుకురావాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలు, పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఉత్పత్తి దశకు చేరుకునేలా అన్ని విభాగాలలోని ఏపీఐఐసీ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిర్దేశిత గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అలాగే పీఎం విశ్వకర్మ, పీఎంఈజీపీ పథకాలు అర్హులందరికీ దక్కేలా చూడటంతో పాటు వాటి ప్రయోజనాలు లబ్ధిదారులకు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పార్ట్నర్షిప్ సమ్మిట్–2026కు సంబంధించిన రీజినల్ ప్రోగ్రామ్ వివరాలను అధికారులకు వివరించారు. జిల్లాలో నెలకొల్పిన పరిశ్రమలకు పెట్టుబడి రాయితీల మంజూరు పురోగతిని సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, ఏపీఐఐసీ జెడ్ఎం నగేష్ కుమార్, పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


