ప్రశాంతి నిలయం: అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. రహదారి ప్రమాదాల నివారణ, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, రహదారి భద్రతా చర్యలు, స్కూల్ జోన్లలో భద్రత, ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. జిల్లాలోని పాఠశాలల పరిసరాల్లో రహదారి భద్రతా చర్యలపై విద్యాశాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. హెల్మెట్ వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీటీఓ కరుణ సాగర్ రెడ్డి, పోలీసు, రవాణా, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
వినాయక చవితి వేడుకను అందరూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన ఎస్పీ సతీష్కుమార్తో కలిసి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వినాయక చవితి వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పీస్ కమిటీ సభ్యులు, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ, విగ్రహ ప్రతిష్ఠాపన, మండపాలకు విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుధ్య చర్యలు నిరంతరం కొనసాగేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీస్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. నిమజ్జనం జరిగే చెరువులు, ఘాట్లు, వాటర్ బాడీల వద్ద క్రేన్లు, లైఫ్గార్డులు, మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పీస్ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బేస్బాల్ చాంపియన్షిప్ పోస్టర్ల విడుదల..
అమెచ్యూర్ బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ శ్రీ సత్యసాయి జిల్లా, నల్లమాడ బేస్బాల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు పుట్టపర్తి వేదికగా నిర్వహించనున్న బేస్బాల్ చాంంపియన్షిప్ పోస్టర్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రామ్, అసోసియేషన్ ప్రతినిధులు నరసింహులు నాయక్, రామచంద్ర నాయక్, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రాణనష్టం జరగకుండా చూడాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం


