మంచి విద్యే ఉన్నత జీవితానికి పునాది | - | Sakshi
Sakshi News home page

మంచి విద్యే ఉన్నత జీవితానికి పునాది

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

ఎస్పీ సతీష్‌కుమార్‌

రామగిరి: మంచి విద్య, ఉన్నత విలువలే పిల్లల భవిష్యత్‌కు బలమైన పునాదని ఎస్పీ సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నసనకోట సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో మెగా పేరెంట్స్‌ – టీచర్‌ మీట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు. ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, తన తల్లిదండ్రులు ఆరో తరగతి వరకే చదివినా తాను పట్టుదలతో చదివి ఎస్పీ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ మహమ్మద్‌ అలీ, ఎస్‌ఐ ప్రదీప్‌రాజ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వాస్పత్రి

సూపరింటెండెంట్‌ మృతి

హిందూపురం టౌన్‌: స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ రాజగోపాల్‌ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. డాక్టర్‌ రాజగోపాల్‌ కుమార్తె విదేశాల నుంచి ఇంటి రావడంతో సెలవుపై ఆయన తన స్వగ్రామమైన తిరుపతికి వెళ్లారు. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలో ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి స్థానిక వైద్యులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

టీడీపీ నేత వేధింపులే కారణమా?

ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ రాజగోపాల్‌ను టీడీపీ నేత చింటు తీవ్రంగా వేధించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. శానిటేషన్‌ విభాగంలో చింటు కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. ఆర్థిక విషయాల్లో రాజగోపాల్‌ను వేధించారంటున్నారు. కొన్ని రోజులుగా ఇదే విషయంపై ఆస్పత్రి ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరిగింది. ఆకస్మికంగా సూపరింటెండెంట్‌ మృతి చెందడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. చింటు ప్రభుత్వాస్పత్రిలో తన మాటే జరగాలనేలా వ్యవహరించడం, బిల్లుల వ్యవహారంలో సూపరింటెండెంట్‌కు చింటుకు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

హిందూపురం టౌన్‌: ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న సంక్షేమ, వైద్య కార్యక్రమాల లక్ష్య సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం, ఉదాసీనతనూ సహించబోమని డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం స్పష్టం చేశారు. పెనుకొండ, హిందూపురం డివిజన్ల పరిధిలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో శుక్రవారం పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలోని డీఈఐసీ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాలను వంద శాతం అమలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్దేశించిన పనితీరు సూచికలలో పూర్తిస్థాయి పురోగతి సాధించాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మంజువాణి, ఎన్టీఆర్‌ వైద్యసేవల జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీదేవి, డీపీఎంఓ పద్మజ, జిల్లా క్షయ నివారణ అధికారి అనుపమ, జిల్లా మలేరియా అధికారి చెన్నారెడ్డి, ఎన్‌సీడీ జిల్లా అధికారి సునీల్‌, డీపీఓ నాగరాజు, ఏఎంఓ లక్ష్మీనాయక్‌, డీపీహెచ్‌ఎన్‌ వీరమ్మ, సీహెచ్‌ఓ వన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement