పుట్టపర్తి టౌన్: విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రైవేటు పాఠశాల యజమానులు స్వచ్ఛందంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థి సంఘాల నాయకులు పుట్టపర్తి పట్టణంలో గణేష్ కూడలిలో ఉరితాడుతో నిరసన తెలిపిన తర్వాత దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షలో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కార్యక్రమంలో విద్యార్థిఽ సంఘం నాయకులు అక్షయ్, దినేష్ పవన్, యస్వంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.


