ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురష్కరించుకుని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘5కే రన్ అండ్ రైడ్’ (ఐక్యతా పరుగు) చివరి దశకు చేరుకుంది. ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 26న పుట్టపర్తిలో నిర్వహించనున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే తెలిపారు. బుధవారం వారు ఐక్యతా పరుగుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందించే టీ షర్టు , మెడళ్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఐక్యత, ఆరోగ్యం, మానవతా విలువలు, ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రేరణగా ‘5కే రన్ అండ్ రైడ్’ దేశ వ్యాప్తంగా నిర్వహించామన్నారు. 45 నగరాల్లో విజయవంతంగా నిర్వహించిన ఐక్యతా పరుగులో 1.10 లక్షల మంది యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26న సత్యసాయి హిల్వ్యూ స్టేడియం నుంచి ఉదయం 5.30 గంటలకు ‘5కే రన్ అండ్ రైడ్’ ప్రారంభమవుతుందని, పుట్టపర్తి ప్రధాన రహదారి, గణేష్ సర్కిల్, విమానాశ్రయం సమీపంలోని పెట్రోలు బంక్ మీదుగా సాగి తిరిగి హిల్ వ్యూ స్టేడియం చేరుకుంటుందన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇండోర్ స్టేడియంలో ఉచితంగా టీ షర్టు, పంపిణీ చేస్తామన్నారు. 5కే రన్కు తమ సొంత సైకిళ్లను తీసుకురావాలన్నారు. వివరాలకు 8897369392, 7411455705 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


