లేపాక్షి: ప్రజల జీవనశైలిలో యోగా ఒక భాగం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు. చరిత్రాత్మక లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్ యోగా క్యాంపెయిన్ ఘనంగా నిర్వహించారు. మంత్రులు సత్యకుమార్, సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ, అధికారులు, స్థానికులు, విద్యార్థులు యోగాసనాలు సాధన చేశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాభ్యాసకులుగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ప్రజలు డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆయుష్ ప్రతినిధులు, యోగా మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
7 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 7 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 155.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా అమరాపురం మండలంలో 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, పెనుకొండలో 27.2 మి.మీ. గుడిబండ 24.2, పుట్టపర్తి 14.2, రామగిరి 12.8, బుక్కపట్నం 9.4, కొత్తచెరువులో 9.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.


