సందడిగా బాలోత్సవం
అనంతపురం కల్చరల్: జిల్లా కేంద్రమైన అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల వేదికగా రెండు రోజుల పాటూ సాగిన బాలోత్సవం ఘనంగా ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సందేశాత్మక నాటికలు, సినీ, జానపద గేయాలు, నృత్యాలు అందరినీ కట్టిపడేశాయి. అలాగే గిల్డ్ ఆఫ్ సర్వీసు ప్రాంగణంలో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలు ఆలోచనాత్మకంగా సాగాయి. వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనంలోనూ విద్యార్థులు అద్భుతమైన సృజనతో అలరించారు. వేర్వేరు విభాగాలకు కత్తివిజయ్కుమార్, వన్నూర్ మాస్టర్, రియాజుద్దీన్, నానీల నాగేంద్ర, డాక్టర్ జూటూరు షరీఫ్, నగరూరు రసూల్, లంకా రవి, మధురశ్రీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బాలోత్సవం కమిటీ చైర్పర్సన్ షమీం సఫీవుల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్ రమేష్, ఎల్కేపి కార్యదర్శి పద్మజ, సోషల్వెల్ఫేర్ డీడీ కుష్బూకొఠారీ, ఇంజనీర్ తిరుపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు శీలా జయరామప్ప, ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ నాయకుడు సుబ్బారెడ్డి, కేఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరత్నమ్మ, సీఎ హరిశ్చంద్రరామ, సాయిబాబా కళాశాల కమిటీ కార్యదర్శి డాక్టర్ నిర్మలమ్మ, బాలోత్సవం ప్రతినిధులు సావిత్రి, శ్రీనివాసరావు, జిలాన్, ఇన్నర్ వీల్ జయంతి తదితరులు ప్రసంగించారు. ప్రతి విద్యార్థి తరగతి గదిని జీవితాన్ని తీర్చిదిద్దే భవితగా చూడాలని, అప్పుడే ఉన్నతంగా రాణించగలరన్నారు. అనంతరం పలు పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లు, జ్ఞాపికలనందించారు.


