
ప్రజారోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
● పరిగి, ఊటుకూరు పీహెచ్సీలను
తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
● కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్లో
భోజన గది పరిశీలన
పరిగి: ప్రజారోగ్యంపై అశ్రద్ధ వహించకుండా సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ ఫైరోజ్ బేగం ఆదేశించారు. బుధవారం పరిగి మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. తొలుత స్థానిక పీహెచ్సీని పరిశీలించారు. పలు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఊటుకూరులో నూతనంగా ఏర్పాటైన పీహెచ్సీని తనిఖీ చేశారు. అలాగే కొడిగెనహళ్లిలోని ఏపీఆర్ఎస్ పాఠశాలను తనిఖీ చేశారు. మద్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. దోమకాటు జబ్బుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్వరూపరెడ్డి, నవీన, సురేష్, రూబీ, సీహెచ్ఓ వన్నప్ప, పీహెచ్ఎన్ వెంకమ్మ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిపై కేసు నమోదు
కదిరి టౌన్: స్థలం పేరుతో మహిళను వంచనకు గురి చేసిన కేసులో ఓ ఉపాధ్యాయుడితో పాటు ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి బుధవారం వెల్లడించారు. స్థానిక అడపాలవీధిలో నివాసముంటూ టైలరింగ్తో జీవనం సాగిస్తున్న షేక్ భానుకు అదే వీధికి చెందిన ఉపాధ్యాయుడు మేకల ఓబులేసు, ఆయన కుమారుడు కరేజ్కుమార్.. స్థలం ఇస్తామంటూ ఆశ చూసి రూ.13 లక్షలు తీసుకున్నారు. అయితే స్థలం ఇవ్వకపోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఆ సమయంలో ఇద్దరూ బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యం చేశారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓబులేసు, ఆయన కుమారుడు కరేజ్కుమార్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం
ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజారోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు