కార్మికుల పొట్టకొడితే సహించం
ఈ చిన్నారులు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సిద్దరాంపురం విద్యార్థులు. వీరికి అనంతపురం నుంచి ఓ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజనం అందుతుంది. ఈ నెల 5వ తేదీన వాహనం సమస్యతో గంట ఆలస్యంగా భోజనం పాఠశాలకు చేరింది. అప్పటికే ఆకలితో అల్లాడిపోయిన విద్యార్థులు చల్లారిపోయిన భోజనాన్ని హడావుడిగా తిన్నారు. తరచూ ఇలాగే జరుగుతూ ఉంటుందని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు.
అనంతపురం నుంచి 9 కి.మీ దూరంలోని సిద్దరాపురం గ్రామానికే రోజుకో సమస్యతో వారంలో కనీసం మూడు రోజులు భోజనం ఆలస్యంగా అందుతుంది. అలాంటిది స్థానికంగా ఉండే ఏజెన్సీలను తొలగించి ‘స్మార్ట్’ కిచెన్ల ద్వారా రోజూ 15 కి.మీ దూరంలోని పాఠశాలలకు భోజనం పంపుతామని ప్రభుత్వం చెబుతోంది. మధ్యాహ్న ఏజెన్సీ కార్మికుల పొట్టకొట్టి మధ్యాహ్నం భోజనం నిధులు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే ‘పచ్చ’ కుట్ర జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశాంతి నిలయం: ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగన్ సర్కార్...మధ్యాహ్న వేళ పౌష్టికాహారం అందిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వంట వండిపెట్టడం ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి కల్పించింది. పిల్లలకు రుచి, శుచికరమైన భోజనాన్ని వడ్డించింది. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పథకం పేరును ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’గా మార్చి అమలు తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. వంట ఏజెన్సీల స్థానంలో ‘స్మార్ట్’ కిచెన్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన ప్రభుత్వం.. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఏజెన్సీలను తొలగించి తమ అనుయాయుల చేత స్మార్ట్కిచెన్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
జిల్లాలో 7 వేల మందికిపైగా కార్మికులు..
జిల్లాలో 1,983 ప్రభుత్వ పాఠశాలలుండగా... 1,16,137 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పొందుతున్నారు. 1983 పాఠశాలలకు గాను ప్రతి పాఠశాలకు ఒక ఏజెన్సీ వంట పనులు నిర్వహిస్తుండగా.. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఏజెన్సీలో ముగ్గురు నుంచి ఐదుగురు ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 7 వేల మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా పొట్ట పోసుకుంటున్నారు. ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లు అమలు చేస్తే వీరందరూ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది.
జిల్లాలో 10 పాఠశాలలు ఎంపిక..
జిల్లాలో తొలి దశలో స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు 10 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోరంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, పెద్దచోళగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాల, మడకశిర ఉన్నత పాఠశాల, నసనకోట ఉన్నత పాఠశాల, తలుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
12 కి.మీ దూరం పాఠశాలలకు సరఫరా..
అనువైన పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం.. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల పరిధిలోని మూడు రూట్ల ద్వారా 3 నుంచి 5 వేల మంది విద్యార్థులకు ఆహార పదార్థాలు సరఫరా చేయాలని భావిస్తోంది. తద్వారా ఏజెన్సీల నిర్వహణ భారం తగ్గించుకోవడంతో పాటు తమ అనుయాయులకు స్మార్ట్ కిచెన్ నిర్వహణ కాంట్రాక్ట్ను అప్పగించి దోచిపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్మార్ట్ కిచెన్ విధానం అమలైతే ఏజెన్సీల స్థానంలో కాంట్రాక్టర్లు మధ్యాహ్న భోజనం తయారు చేయనున్నారు.
నాణ్యత గోవింద!
స్మార్ట్కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజన పథకం అమలైతే విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందే పరిస్థితి ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నారు. స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి అక్కడ వండిన ఆహార పదార్థాలను వాహనాల ద్వారా 12 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల పంపుతారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన ఏజెన్సీల పనితీరును, ఆహార పదార్థాల నాణ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరిశీలి స్తున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఆహారం సరఫరా చేయడం వల్ల పర్యవేక్షణ కొరవడుతుంది. సమయ పాలన కూడా సరిగా ఉండదు. ఫలితంగా మధ్యాహ్న భోజనం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం స్మార్ట్ ఆలోచనను విరమించుకోవాలని తల్లిదండ్రులు సైతం సూచిస్తున్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన స్మార్ట్ కిచెన్ విధానం ఎవరిని సంతృప్తి పరిచేందుకు తీసుకువస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు సర్కార్ మరో కుతంత్రం
‘స్మార్ట్’ కిచెన్ల పేరుతో పన్నాగం
మధ్యాహ్న భోజన కార్మికుల నోట్లో మట్టి!
‘తమ్ముళ్ల’కు మధ్యాహ్న భోజనం
బాధ్యతలు
తొలి దశలో 10 స్మార్ట్ కిచెన్ల
ఏర్పాటుకు రంగం సిద్ధం
స్మార్ట్ కిచెన్లతో మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో పనిచేస్తున్న 7 వేల మంది కార్మికులు వీధిన పడతారు. స్మార్ట్ కిచెన్లను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళన చేశాం. చంద్రబాబు ప్రజా ధనాన్ని టీడీపీ నాయకులను దోచిపెట్టేందుకే స్మార్ట్ కిచెన్లను తీసుకు వస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి మేలు జరగదు. – లక్ష్మీనారాయణ,
సీఐటీయూ జిల్లా కోశాధికారి
కార్మికుల పొట్టకొడితే సహించం
కార్మికుల పొట్టకొడితే సహించం


