పుట్టపర్తి అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్రశాఖ పిలుపు మేరకు స్థానిక యూటీఎఫ్ నాయకులు బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ‘రణభేరి 3.0’ పేరుతో నిరాహార దీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ సువర్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆశపడ్డామని, అయితే రెండేళ్లవుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికే రణభేరి 1.0, 2.0 చేసినా ఫలితం లేకపోవడంతో మడో వితగా ‘రణభేరి 3.0’ పేరుతో నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఐఆర్ ప్రకటిస్తామని, సీపీఎస్కు బదులు ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీం ప్రవేశ పెడతామని, 12వ పీఆర్సీ చైర్మన్ను నియమిస్తామని, ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు అధికారం చేపట్టాక హామీలన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాబోయే కాలంలో రాష్ట్రస్థాయి ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కూటమి సర్కార్ విద్యా విధానాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోందన్నారు. నిరాహార దీక్షలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణానాయక్, జేఏసీ నాయకులు రామ్మోహన్, వేణుగోపాల్, ఈశ్వరయ్య, శ్రీరాములు నాయక్, సంఘ నాయకులు మల్లికార్జునరెడ్డి, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, కార్యదర్శులు మల్లికార్జున, నరసింహప్ప, అమర నారాయణరెడ్డి, మురళీ, చెన్నకేశవులు, బాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ 3.0 రణభేరిలో
టీచర్ల డిమాండ్


