వివాహేతర సంబంధం మోజులో భార్యాపిల్లలను పట్టించుకోని భర్త
Published
Tue, Nov 28 2023 1:22 AM
పుట్టపర్తి టౌన్:వివాహేతర సంబంధం మోజులో తమను రోడ్డు పాలు చేసిన భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ అదనపు ఎస్పీ విష్ణును పిల్లలతో కలసి ఓ వివాహిత వేడుకుంది. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయనకు వినతి పత్రం అందజేసి, మాట్లాడింది. వివరాలు.. నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రమణమ్మకు అదే మండలం దొన్నికోటకు చెందిన అంజితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈ క్రమంలో పరాయి సీ్త్ర తో అంజి వివాహేతర సంబంధం కొనసాగించడం గమనించిన రమణమ్మ నిలదీసింది. దీంతో భార్యను కొట్టి, ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె రోడ్డుపాలైంది. చివరకు భిక్షమెత్తుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. తన దుస్థితిని ఏఎస్పీ విష్ణుకు ఆమె వివరించి, తనకు న్యాయం చేయాలని విన్నవించింది. కాగా, పోలీసు స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 26 వినతులు అందాయి. పరిశీలించిన ఏఎస్పీ విష్ణు... ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.