● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు, భద్రత, నిమజ్జన కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. గణేష్ ఘాట్, రంగనాథస్వామి దేవస్థాన సమీపంలోని పెన్నా బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గణేష్ మండపాలకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో పూడిక తొలగించి, నీటి లోతును గుర్తించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఊరేగింపు మార్గాల్లో గుంతలు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులను ముందుగానే తొలగించాలన్నారు. డీజేలు, మైక్లు, ఊరేగింపు సమయాలకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో విజయ్కుమార్, ఏఎస్పీ సౌజన్య, ఆర్డీఓ అనూష, వివిధ శాఖల అధికారులు, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


