● కావలి కాలువలో యువకుడి గల్లంతు
● కొద్దిసేపటికే మృతదేహం లభ్యం
సంగం: ఆ యువకుడు పొట్టకూటి కోసం వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా కాలువలో స్నానానికి దిగాడు. కానీ నీటి ప్రవాహం రూపంలో మృత్యువు కబళించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన మోహన్ (30), ఇబ్రహీం నేమ్బోర్డులు బిగించే పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగెళ్తూ శుక్రవారం సంగం కావలి కాలువ వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికే మోహన్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన ఇబ్రహీం ఈత కొట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మోహన్ మాత్రం నీటిలో కొట్టుకుపోయి కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మోహన్ ఆచూకీ లభించలేదు. చివరకు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు.


