● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
కలిగిరి: కలిగిరి పెద్ద చెరువు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ తంతు జరుగుతున్నా, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదివారం హిటాచీ, నాలుగు టిప్పర్లలో జోరుగా తరలించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు ఉండటంతో అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించడంలేదు. వ్యవసాయ పనులకంటూ కొంత మేర అనుమతులు పొంది, ప్రైవేట్ స్థలాలకు మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలిగిరి పెద్ద చెరువులో భారీ యంత్రాలు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో పెద్ద గుంతులు ఏర్పడ్డాయి. చెరువు కట్ట సమీపంలోనే అక్రమంగా తరలిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలిగిరిలోని ఇరిగేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ వ్యవహారం సాగుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి తరలింపునకు అడ్డుకట్టేసి పెద్ద చెరువును కాపాడాలని ఆయకట్ట రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రావెల్ను తరలిస్తున్న వాహనాలు
టిప్పర్లో మట్టిని పోస్తున్న యంత్రం


