● కాఠ్మాండుకు చేరేందుకు
ప్రయత్నిస్తున్నాం
● టిబెట్ నుంచి డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి సందేశం
ఆత్మకూరురూరల్: డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టిబెట్లోని మానస సరోవర్ యాత్రకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ జలప్రళయం ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనలో ఉన్నారు. దీంతో ఆయన తామంతా క్షేమంగా ఉన్నామని, మానస సరోవర్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రస్తుతం టిబెట్లోని సాగాలో క్షేమంగా ఉన్నామని సతీష్రెడ్డి సందేశాన్ని పంపారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తిరుగు ప్రయాణంలో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుతం తమ బృందం రోడ్డు మార్గంలో కాఠ్మాండుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తోందని సతీష్రెడ్డి వెల్లడించారు. రహదారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నామని, మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే శనివారం సాయంత్రానికి కాఠ్మాండు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అనుకున్న ప్రకారం విమాన టికెట్లు బుక్ చేసుకున్నామని, కాఠ్మాండు నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ మీదుగా హైదరాబాద్కు తిరిగి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ బృందంలోని అందరూ సురక్షితంగా ఉన్నారని, కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేపాల్లో వరదల కారణంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వాటికి సంబంధించిన వివరాలను మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గంలో సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


