నెల్లూరు(పొగతోట): తక్కువ ఖర్చుతో అధిక ఆదాయమొచ్చే పంటలను రైతులు సాగుచేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో వివిధ మండలాల ఎంపీఎంలు, ఎఫ్పీఓల సీసీలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆర్గనిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకూరుపేటలో గుర్రపుడెక్కతో ఎరువుల తయారీ పద్ధతి అందుబాటులో ఉందని వివరించారు. ఆత్మకూరులో అరటి నారతో రూపొందించే ఉత్పత్తుల యూనిట్లను ఏర్పాటు చేశారన్నారు. కలువాయి, సైదాపురం, చేజర్ల, మర్రిపాడు, దుత్తలూరు మండలాల్లో రైతులకు తక్కువ ధరలకే వ్యవసాయ పరికరాలను అందజేసేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన మండలాల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. లావాదేవీలను సక్రమంగా నమోదు చేయాలని ఎఫ్పీఓలకు సూచించారు. అనంతరం సెర్ప్ అడిషనల్ డైరెక్టర్ (ఫార్మ్) మహిత మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపులకు వివిధ రకాల రుణాలను మంజూరు చేయనున్నామని వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు రైతులందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని సూచించారు. అకౌంట్స్ సాఫ్ట్వేర్ ద్వారా లావాదేవీలను నిర్వహించాలని చెప్పారు.


