నెల్లూరు(అర్బన్): జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో గర్భిణులకు లింగ నిర్ధారణ చేశారనే తెలిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సుజాత స్పష్టం చేశారు. పీసీ పీఎన్డీటీ యాక్ట్ అమలు తీరుపై సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో గల తన చాంబర్లో కమిటీ సభ్యులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా అన్ని స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించేలా కమిటీ సభ్యులను నియమించామని వెల్లడించారు. స్కాన్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. లైసెన్స్లను సకాలంలో రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. గైనకాలజిస్ట్ కిరణ్, జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణరెడ్డి, ఇమ్యూనైజేషన్ జిల్లా అధికారి బ్రిజిత, డిప్యూటీ డెమో సునీత, ఎస్ఓ సహన, ఎన్డీఓలు శ్రీనివాస్, కుసుమ, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏం పర్వాలేదు..
ఇసుక తవ్వుకోండి..!
● ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం
బుచ్చిరెడ్డిపాళెం: నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉన్నా, తవ్వుకోండంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా నదుల్లో ఇసుక తవ్వకాలను నిర్ణీత కాలం పాటు నిలిపేస్తారు. అయితే ఈ నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఓ టీడీపీ నేత శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇసుక లభ్యతపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రీచ్ల నుంచి పగటిపూట ఇసుకను తరలించుకోవచ్చని, యంత్రాలను ఉపయోగించకుండా మనుషుల ద్వారా ట్రాక్టర్లలో పంపొచ్చని నేతలకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు అక్రమార్కులకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రవాణా శాఖ అధికారుల్లో
ఎట్టకేలకు కదలిక
నెల్లూరు (టౌన్): నగరంలోని టౌన్ బస్సుల నిబంధనల అతిక్రమణపై జిల్లా రవాణా శాఖ అధికారుల్లో ఎట్టకేలకు కదలికొచ్చింది. ‘మా దారి అడ్డ దారి’ అనే శీర్షికన సాక్షిలో కథనం మంగళవారం ప్రచురితమైన నేపథ్యంలో, టౌన్ బస్సులపై తనిఖీలను రవాణా స్క్వాడ్ అఽధికారులు నిర్వహించారు. పొల్యూషన్ లేదని.. ఎల్ఈడీ లైట్లు బిగించారని.. హెవీ హారన్లు.. పత్రాలు చూపించలేదంటూ ఆయా బస్సులపై కేసులు నమోదు చేశారు. రూ.100 నుంచి రూ.600 వరకు అపరాధ రుసుమును విధించారు. కాగా స్క్వాడ్ అధికారులు నమోదు చేసిన కేసులపై రవాణా శాఖలో పనిచేస్తున్న అధికారులే నవ్వుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి
ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవా రం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 77,085 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 33,766 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.4.61 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


