నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం

Mar 16 2026 7:21 AM | Updated on Mar 16 2026 7:21 AM

జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలు

నెల్లూరు (టౌన్‌): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్‌ 27,910, ప్రైవేట్‌ 679 మంది కలిపి మొత్తం 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 174 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏ సెంటర్లు 95, బీ సెంటర్లు 55, సీ సెంటర్లు 24గా విభజించారు. ఇప్పటికే పోలీసు స్టేషన్లలోని స్ట్రాంగ్‌రూముల్లో ప్రశ్న పత్రాలను భద్రపరిచారు. పరీక్షకు ముందుగా ప్రశ్న పత్రాలను కేంద్రాలకు చేర్చనున్నారు. విద్యార్థులను పరీక్ష సమయానికి అరగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూమ్‌ 83414 08109 నంబర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు మెడికల్‌ కిట్‌, ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచనున్నారు.

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పది పరీక్షలకు 1532 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. అయితే ప్రైవేట్‌ ఉపాధ్యాయులను నియమిస్తే ప్రైవేట్‌ పాఠశాలల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగే అవకాశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా 174 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 174 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా 9 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. సీ సెంటర్లకు చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులతోపాటు మరో 24 మంది గ్రేడ్‌–2 హెడ్‌మాస్టర్లను కస్టోడియన్లుగా నియమించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. సమీపంలోని జెరాక్స్‌, ఆన్‌లైన్‌ సెంటర్లను మూసివేయనున్నారు.

8 కేంద్రాలకే సీసీ కెమెరాలు

సాధారణంగా సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో కేవలం అతి సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్న 8 పరీక్ష కేంద్రాల్లోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి 8 కేంద్రాలకే అనుమతి వచ్చినట్లుగా చెబుతున్నారు.

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

పదో తరగతి విద్యార్థుల హాల్‌టికెట్లను విద్యాశాఖ వెబ్‌సైట్‌ bse.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ జిల్లా, స్కూల్‌, పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌ టికెట్‌ మీద స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ సంతకం అవసరం లేదు.

ఆల్‌ ద బెస్ట్‌

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు (పొగతోట): సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ ఆదివారం ఒక ప్రకటనలో ఆల్‌ ద బెస్ట్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారన్నారు. విద్యా శాఖ 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి హాజరుకావాలన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని పరీక్షలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌కు మార్గం ఏర్పరుచుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నిలపాలని కోరారు.

జిల్లాలో 174 సెంటర్ల ఏర్పాటు

హాజరుకానున్న

28,589 మంది విద్యార్థులు

1532 మంది ఇన్విజిలేటర్లు

174 మంది సీఎస్‌లు, 174 మంది డీఓలు

9 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ నియామకం

తొలిసారి ఇన్విజిలేటర్లుగా

ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలు

అందులో 8 అతి సమస్యాత్మక కేంద్రాలు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం

ఉచిత బస్సు సౌకర్యం

పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రజారవాణాశాఖ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల్లో హాల్‌ టికెట్‌ను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

జిల్లా వ్యాప్తంగా 8 సమస్యాత్మక కేంద్రాలు, మరో 8 అతి సమస్యాత్మక కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అతిసమస్యాత్మక కేంద్రాలుగా విడవలూరు జెడ్పీహెచ్‌ఎస్‌, పొదలకూరు మండలం మహ్మదాపురం జెడ్పీహెచ్‌ఎస్‌, కలువాయి జెడ్పీహెచ్‌ఎస్‌లోని ఏ, బీ సెంటర్లు, నెల్లూరు రూరల్‌లోని సౌత్‌మోపూరు జెడ్పీహెచ్‌ఎస్‌, మర్రిపాడు జెడ్పీహెచ్‌ఎస్‌, అనంతసాగరం మండలం రేవూరు జెడ్పీహెచ్‌ఎస్‌, ఇందుకూరుపేటలోని ఎంకేఆర్‌ ప్రభుత్వ హైస్కూల్‌, కందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మ క కేంద్రాలుగా నెల్లూరు రూరల్‌ నారాయణరెడ్డిపేట జెడ్పీహెచ్‌ఎస్‌, ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని రత్నం ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌, ఇందుకూరుపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్‌ఎస్‌, బోగోలు మండలం బిట్రగుంట జెడ్పీహెచ్‌ఎస్‌, జెడ్పీజీహెచ్‌ఎస్‌, జలదంకి జెడ్పీహెచ్‌ఎస్‌, అనంతసాగరం జెడ్పీహెచ్‌ఎస్‌, వరికుంటపాడు జెడ్పీహెచ్‌ఎస్‌, ఉదయగిరి మండలం గండిపాళెంలోని ఏపీఆర్‌ఎస్‌ కేంద్రాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement