మా ఆవేదన పట్టించుకోరా?
● భారీ ర్యాలీ నిర్వహించిన పీఏసీఎస్ ఉద్యోగులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘మా ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారిలో కనీసం చలనం లేకుండా పోయింది’ అని పీఏసీఎస్ ఉద్యోగులు వాపోయారు. వారు మంగళవారం నెల్లూరులో భారీ ర్యాలీ చేపట్టారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి మద్రాస్ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా తిరిగి గాంధీబొమ్మ సెంటర్ వద్దనున్న డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసీ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రామానాయుడు, కొండూరు గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు గతేడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి పలు రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్, జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాధయ్య, ట్రెజరర్ మల్లికార్జునరావు, అడ్వైజర్ రమణమూర్తి, ఉపాధ్యక్షుడు సురేష్రెడ్డి, పోలయ్య సెక్రటరీలు మస్తాన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఖాజామస్తాన్, సుబ్బారావు, ప్రమోద్ పాల్గొన్నారు.


