టీడీపీ గూండాల దాడులు సిగ్గుచేటు
● వైఎస్సార్సీపీ నేతలపై ఎక్కువైన దౌర్జన్యాలు
● చికిత్స పొందుతున్న రాఘవేంద్రకు కాకాణి పరామర్శ
నెల్లూరు(అర్బన్): అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడటాన్ని హేయమైన చర్యగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అభివర్ణించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటాచలం మండలం వడ్డిపాళేనికి చెందిన పార్టీ నేత ఉప్పు రాఘవేంద్రను మంగళవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. వెంకటాచలం పంచాయతీలో పచ్చ పార్టీ నేతల దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని విమర్శించారు. రాఘవేంద్ర గతంలో తమ పార్టీలో ఉంటూ, 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విజయానికి కృషి చేశారని తెలిపారు. అయితే ఆయన అవినీతి, అక్రమాలతో విసిగిపోయి వార్డు సభ్యుడిగా ఉన్న రాఘవేంద్ర ఇటీవల తన భార్యతో కలిసి తమ పార్టీలో చేరారని వివరించారు. జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసేందుకు తనతో కలిసి పని చేస్తానని చెప్పారని, దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ రౌడీమూకలు.. రాఘవేంద్రపై దాడి చేసి మరణించారని భావించి వెళ్లిపోయారని తెలిపారు. వైద్యులతో మాట్లాడానని.. ప్రాణాపాయం లేదని.. కోలుకునేందుకు కొన్ని రోజులు పడుతుందని తెలిపారన్నారు.
సీఐపై విచారణ జరపాలి
బాధితులపైనే కేసులు పెట్టి.. నిందితులను వదిలిపెట్టడాన్ని వెంకటాచలం సీఐ సుబ్బారావు అలవాటుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. ఈయనపై ఎస్పీ తక్షణమే విచారణ జరిపించాలని, అప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వస్తా యని పేర్కొన్నారు. సీఐకు టీడీపీపై అభిమానం ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి అందులో చేరాలని హితవు పలికారు. తమ పార్టీ శ్రేణుల జోలికొస్తే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. రాఘవేంద్రకు రక్షణ కల్పించి దాడి చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలపై దాడి చేసి హత్యలకు టీడీపీ నేతలు యత్నించడం.. తాము గొడవ చేస్తే మొక్కుబడిగా కేసులు నమోదు చేసి కొద్ది రోజుల తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేయడం దారుణమని చెప్పారు. తమ పార్టీ శ్రేణులపై పోలీసులు అనుసరిస్తున్న తీరు సరికాదని, వైఖరిని ఇప్పటికై నా మార్చుకోవాలని హితవు పలికారు.
దాడి చేసిన వారిని వదిలేది లేదు
దాడి చేసిన వారిని వదిలేదిలేదని కాకాణి పేర్కొన్నారు. ఇంతకు పది రెట్ల మానసిక క్షోభను అనుభవిస్తారని తెలిపారు. వారి తరహాలో తాము దాడులు చేయబోమని చెప్పారు. తప్పు చేసిన ప్రతి ఒక్కర్నీ చట్టబద్ధంగా న్యాయస్థానంలో నిలబెట్టి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని పేర్కొన్నారు.


