మేయర్ ఎన్నిక రేపు
● దేవరకొండ సుజాతను ప్రకటించే అవకాశం
నెల్లూరు(బారకాసు): రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు నెల్లూరు మేయర్ ఎన్నికను గురువారం నిర్వహించనున్నారు. వాస్తవానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేయర్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించడంతో 12వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన స్రవంతికి ఈ అవకాశం మొదట్లో దక్కింది. నాలుగేళ్ల పాటు పదివిలో ఆమె కొనసాగారు. ఈ తరుణంలో టీడీపీ ప్ర భుత్వం అధికారంలోకి రావడంతో అనేక ప్రలోభాలకు గురిచేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఆ పార్టీ పంచన చేరారు. దీంతో మేయర్ కుర్చీపై కన్నేసిన డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ ఆ దిశగా పావులు కదిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో తనంటత తానే పదవికి స్రవంతి గతేడాది డిసెంబర్ 14న రాజీనామా చేశారు. ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు రూప్కుమార్యాదవ్ను ఇన్చార్జి మేయర్గా నియమించారు. ఎస్టీలకు కేటాయించిన స్థానంలో ఆయనకు అవకాశాన్ని ఎలా ఇస్తారంటూ గిరిజన సంఘాల నేతలతో పాటు స్రవంతి, ఆమె భర్త జయవర్థన్ పలు రకాలుగా ఆందోళనలు, పోరాటాలు చేశా రు. ఎట్టకేలకు మేయర్ ఎన్నికను గురువారం నిర్వహించాలంటూ నోటిఫికేషన్ను ఈ నెల 12న ఎన్నికల సంఘం జారీ చేసింది. టీడీపీ ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతకు మేయర్ అవకాశాన్ని కల్పించనున్నారని సమాచారం. కార్పొరేషన్ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకాధికారిగా జేసీ వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు.


