ప్రైవేట్‌ గుప్పెట్లోకి ప్రభుత్వ వైద్యం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ గుప్పెట్లోకి ప్రభుత్వ వైద్యం

Jun 18 2025 7:20 AM | Updated on Jun 18 2025 7:20 AM

ప్రైవేట్‌ గుప్పెట్లోకి ప్రభుత్వ వైద్యం

ప్రైవేట్‌ గుప్పెట్లోకి ప్రభుత్వ వైద్యం

నెల్లూరు (అర్బన్‌): ప్రభుత్వ వైద్య రంగాన్ని పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్టనర్‌షిప్‌ (పీపీసీ) పేరుతో ప్రైవేట్‌ యాజమాన్యాల చేతికి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంటోందని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఎంవీ రమణయ్య, కామేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాల అనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు నిర్మించిందన్నారు. వీటిలో గత ప్రభుత్వం ప్రారంభించిన నూతన వైద్యకళాశాలలతోపాటు నిర్మాణంలో చివరి దశలో ఉన్న వైద్యకళాశాలలను పీపీపీ మోడ్‌లో ప్రైవేట్‌ వారికి అప్పగిస్తామని కూటమి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించడం దారుణమన్నారు. ఇదే జరిగితే పేదలకు సరైన వైద్యం అందదన్నారు. ప్రజలు వైద్యం కోసం ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వ వైద్యులు కాపాడితే కార్పొరేట్‌ వైద్యులు తాళాలు వేసుకున్నారని, కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు రూ.కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన విధానం మార్చుకోకపోతే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసి మెడికల్‌ సీట్లు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. పేద, అణగారిన వర్గాల వారికి సీట్లు దక్కవన్నారు. రిజర్వేషన్లు కూడా అమలు జరగవన్నారు. కర్ణాటక, ముంబైలో పీపీపీ మోడ్‌లో నడుస్తున్న ప్రభుత్వ వైద్యశాలలు విఫలమయ్యాయన్నారు. అలాంటి వ్యవస్థను రాష్ట్రంలో బలవంతంగా అమలు చేయొద్దన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌లో 50 శాతం సీట్లు ప్రభుత్వమే అమ్ముకునేందుకు వీలు కల్పించే జీఓ నంబర్‌ 107, 108లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడీపీలో వైద్య రంగానికి 6 శాతం నిధులు కేటాయించాలని, నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానంలోనే వైద్య కళాశాలలు, ఆస్పత్రులను నడపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సులకు మేధావులు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు పంపామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులను కొనసాగిస్తామని సీఎం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు జూలై నుంచి శ్రీకారం చుట్టుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు కామయ్య పాల్గొన్నారు.

గత ప్రభుత్వంలో కొత్తగా

17 వైద్య కళాశాలల నిర్మాణం

వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి

పీపీసీ పేరుతో ప్రైవేట్‌కు అప్పగిస్తే

ఊరుకునేదిలేదు

ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement